చిరంజీవులు ఎవరు?

హనుమంతుడు, బలి చక్రవర్తి, కృపాచార్యుడు, విభీషణుడు, పరశురాముడు, వ్యాసుడు, అశ్వత్థామ... వీరిని చిరంజీవులు అని అంటారు. వీరికి మృత్యువు అనేది వుండదు. రామభక్తి చేత హనుమంతుడు, మహావిష్ణువు అవతారమైన వామనుడి అనుగ్రహం చేత బలిచక్రవర్తి, విచిత్ర జన్మ వలన కృపాచార్యుడు చిరంజీవులయ్యారు. అదే విధంగా రాముడి దగ్గర అనుగ్రహం పొందిన విభీషణుడు, అష్టాదశపురాణాలు, మహాభార‌తం రచించిన వ్యాసుడు, మహాశక్తివంతుడైన పరశురాముడు, కృష్ణుడి శాపంతో అశ్వత్థామ చిరంజీవులుగా వున్నారు. వీరితో పాటు భక్త మార్కండేయ కూడా శివానుగ్రహంతో చిరంజీవిగా వున్నారు. అందరికీ భగవంతుడు అనుగ్రహంతో చిరంజీవులుగా వుండమని వరమివ్వగా అశ్వత్థామకు మాత్రం శాపంగా ఇవ్వడం గమనార్హం. ఉపపాండవులను అకారణంగా వధించినందుకు శ్రీకృష్ణభగవానుడి సూచన మేరకు అశ్వత్థామ నుదుటి నుంచి మణిని తీసివేస్తారు. దీంతో అతను తన శక్తిని కోల్పోతాడు. రోగ భారంతో కలియుగం ముగిసేవరకు అరణ్యాలలో సంచరించమని కృష్ణుడు అతనికి శాపం పెడ‌తాడు.