శంఖం విశిష్టత ఏమిటి?

భారతీయ సనాతన సంప్రదాయంలో శంఖానికి విశిష్టమైన ప్రాధాన్యత వుంది. ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే సమయంలో శంఖాన్ని వూదుతారు. శంఖం నుంచి వెలువడే శ‌బ్దం పలురకాల రుగ్మతలను నివారిస్తుందని పురాతన వైద్యశాస్త్రాలు తెలుపుతున్నాయి. శ్రీమహావిష్ణువు శంఖం పాంచజన్యం ఎంతటి పవిత్రమైందో తెలిసిందే. శంఖం ఆవిర్భావానికి సంబంధించి బ్రహ్మవైవర్త పురాణంలో ఒక కథ వుంది. శంఖచూడుడనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మ అనుగ్రహంతో కృష్ణకవచాన్ని పొందాడు. ఆపై బ‌ల‌గ‌ర్వంతో స్వర్గంపై దండెత్తగా ఇంద్రుడు పరమేశ్వరుడిని శరణు కోరాడు. శంఖచూడుని పీడ తొలగించేందుకు శివుడు విష్ణువును సంప్రదించాడు. అంత విష్ణువు బ్రాహ్మణ రూపంలో శంఖచూడుని అభిమానాన్ని చూరగొని కృష్ణకవచ ఉపదేశం పొందాడు. అనంతరం శివుడు ఆ రాక్షసుడిని సంహరించాడు.శంఖచూడుని దేహం సముద్రంలో పడిపోగా ఆయన సతీమణి తులసి తన పాతివ్రత్యమహిమతో శంఖంగా మార్చిందని తెలుస్తోంది. శంఖంలో పోసిన నీరు కొద్ది గంటల తరువాత శక్తి గల నీరుగా మారుతుందని ఆయుర్వేద శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. అందువల్లే శంఖంలో పోస్తేనే తీర్థం అనే నానుడి వచ్చింది. శంఖాల్లోనూ పలు రకాలున్నాయి. దక్షిణభాగం తెరిచివుంటే దక్షిణావర్తశంఖం అంటారు. ఇది విష్ణువుకి, శివునికి ప్రీతపాత్రమైనది.శంఖాన్ని కిందపెట్టకుండా ఏదైనా పళ్లంలో పెట్టి పూజామందిరంలో వుంచాలి. శంఖాన్ని పవిత్రంగా చూసుకోవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.