పుస్తకాలను ఎందుకు సరస్వతి రూపంగా భావిస్తాం?

పుస్తకాలు, గ్రంథాలు,పేపర్లు... ఇలా సమాచారాన్ని, బోధన గురించి వివరించేవాటిని మనం పవిత్రంగా పరిగణిస్తాం. చదువులకు తల్లి సరస్వతి దేవి. ఆమె కటాక్షం వుంటే చదువుల్లో రాణిస్తామని పెద్దలు పేర్కొంటారు. గ్రంథపఠనంతో మనకు విజ్ఞానం లభిస్తుంది. అందుకనే పుస్తకాలను మనం సాక్షాత్తు సరస్వతి స్వరూపంగా భావిస్తాం. అందుకే మనం కాలితో వీటిని తాకినప్పుడు వెంటనే క్షమించమని మొక్కుకుంటాం. భారతీయ సంప్రదాయంలో జ్ఞానమనేది పవిత్రమైనది, దైవ సమానమైనది. వీటి ద్వారా మనం ఎంతో నేర్చుకుంటాం. అందుకనే వీటిని గౌరవభావంతో పవిత్రంగా చూస్తాం. ‘విద్య వినయేన శోభతే’ అంటే మనం ఎంత విద్యనార్జించిన అణుకువగా వుండాలని దీని భావం. అలాంటివారికి వినయం మరింత శోభనిస్తుంది. అందుకనే సరస్వతి స్వరూపమైన పుస్తకాలను కాలితో తాకకూడదు.

సరస్వతి నమస్తుభ్యం
వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి
సిద్దిర్భవతు మే సదా