పంచముఖ ఆంజనేయ స్వామి ఆరాధన అంటే?

శ్రీరామభక్తుడైన ఆంజనేయస్వామిని స్మరిస్తే సకల భూత, ప్రేత, పిశాచ భయాలు తొలగిపోతాయి. స్వామివారి ఆరాధనలో పంచముఖ ఆంజనేయస్వామి ప్రార్థనకు విశిష్టత వుంది. శ్రీ హనుమాన్‌ మాలా మంత్రాన్ని జపిస్తే అన్ని వ్యాధులు, పీడలు తొలగిపోతాయని పరాశర సంహితలోని ఆంజనేయచరిత్ర వివరిస్తోంది. ఐదు ముఖాలతో వుండే స్వామివారి ఒక్కొక్క ముఖానికి ఒక్కో గుణముంది. హనుమాన్‌ ప్రధానముఖంగా వుంటుంది. ఈ ముఖాన్ని చూస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది. నారసింహునికి అభీష్టసిద్ధి, గరుడునికి సమస్త కష్టాలను నాశనం చేసే శక్తి వుంటుంది. కుడివైపు చివరన వుండే వరహా ముఖం దానప్రపత్తిని ఎడమవైపు చివరన వుండే హయగ్రీవ ముఖం సర్వవిద్యలను కలుగజేస్తాయి. అందుకనే పంచముఖ ఆంజనేయస్వామి దర్శనం అన్ని విధాల శుభమని పురాణాలు చెబుతున్నాయి. తుంగభద్ర నదీతీరంలో స్వామి వారి కోసం తపస్సు ఆచరించిన శ్రీరాఘవేంద్రస్వామికి ఆంజనేయస్వామి పంచముఖ ఆంజనేయులుగా ప్రత్యక్షమైనట్టు తెలుస్తోంది. పంచముఖ హనుమాన్‌కు వున్న పదిచేతుల్లోని ఆయుధాలు భక్తులను సదా రక్షిస్తాయి. నాలుగు దిక్కులతో పాటు పైనుంచి వచ్చే విపత్తులనుంచి భక్తులను కాపాడేందుకు స్వామి పంచముఖంగా దర్శనమిస్తారు.