విత్తనాలు వేసేముందు బసవన్నలను ఎందుకు పూజిస్తారు?

ప్రతీ జీవిలోనూ దైవాన్ని చూడగలిగే ఆచారం సనాతనధర్మంలో ఆనాటి నుంచే ఉంది. అందుకు ప్రజలు ఒక్కో ప్రదేశంలో ఒక్కోవిధంగా పూజలు నిర్వహిస్తుంటారు. అనుకున్న సమయానికి వర్షాలు కురిస్తే రోహిణి కార్తెలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విత్తనాలు వేస్తారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో దుక్కిలో విత్తనం వేసేముందు కాడెడ్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఎద్దులు స్వయంగా బసవేశ్వరుడి అంశ అని ప్రజల విశ్వాసం. అందుకే వాతావరణం అనుకూలించి పంటలు బాగా పండాలని బసవేశ్వరులను వేడుకుంటారు. ఆరుగాలం తాము చేసే శ్రమలో ఎద్దుల పాత్ర కూడా ఉంటుంది కాబట్టి పంట పండించడంలో వాటి భాగస్వామ్యం కోసం రైతులు అలా చేస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోగల విరుపాపురంలో ఎద్దులను పరమేశ్వరుని రూపాలుగా భావిస్తారు. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం నాడు ఎద్దులతో ఎలాంటి పని చేయించరు. వాటికి సేవ చేయడం ద్వారా ఆ బసవేశ్వరుడిని చేరుకోవచ్చని ఆ గ్రామ ప్రజల విశ్వాసం.
తెలంగాణ ప్రాంతంలో వేములవాడ రాజరాజేశ్వరాలయంలో సైతం ఎద్దులను ప్రత్యేకంగా పూజిస్తారు. కోడె మొక్కులు అన్న పేరుతో ఒక ఎద్దును స్వామివారి ఆలయంలో పూజలు చేసి ఆలయానికి సమర్పిస్తారు.