పూజలో రాగిపాత్రలను ఎందుకు వాడుతారు?

దేవాలయాల్లోనూ, గృహాల్లోనూ పూజా కార్యక్రమాల్లో రాగిపాత్రలనే వాడుతుంటారు. దీనికి సంబంధించి వివరాలను భూదేవికి సాక్షాత్తు ఆదివరాహస్వామి వివరించినట్టు వరాహ పురాణం పేర్కొంటుంది. కొన్ని వేల యుగాలకు పూర్వం గుడాకేశుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను మహావిష్ణువుని నిత్యం కొలిచేవాడు. వైకుంఠధారి అంటే అతనికి ఎంతో భక్తి. ఒక ఆశ్రమంలో రాగి రూపంలో స్వామి కటాక్షం కోసం కఠోరమైన తపస్సు ఆచరించాడు. కొంత కాలం అనంతరం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. తనకు ఎలాంటి వరాలు వద్దని తన దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండించి భగవంతునిలో ఐక్యం చేసుకోవాలని గుడాకేశుడు కోరుతాడు. తన శరీరం ద్వారా తయారు చేసిన పాత్రలు పూజలో ఉండాలని ప్రార్థిస్తాడు. అందుకు అనుగ్రహించిన పరంధాముడు వైశాఖ శుక్ల పక్ష ద్వాదశి రోజున అతని కోరిక నెరవేరుతుందని వరమిస్తాడు. కొన్నాళ్లకు ద్వాదశి వచ్చింది. సుదర్శనచక్రం అతని శరీరాన్ని ముక్కలు చేస్తుంది. గుడాకేశుని ఆత్మ వైకుంఠానికి చేరుకుంది. శరీరం రాగిగా రూపొందింది. ఈ రాగి పాత్రలను తన పూజలో ఉపయోగించాలని లక్ష్మీపతి భక్తకోటిని ఆదేశించాడు. అప్పటి నుంచి నారాయణుడి పూజలో రాగిపాత్రలకు ప్రాధాన్యత ఏర్పడింది. మానవజీవితం బంధనాలమయంగా ఉంటుంది. అశాశ్వతమైన వస్తువులను శాశ్వతంగా పరిభ్రమించి మానవులు అనేక పాపాలకు పాల్పడుతుంటారు. కానీ సకలా చరాచర జగత్తు ఆ స్వామి సృష్టేనని స్వామి అనుగ్రహం కోసం నిత్యం ప్రార్థనలు చేయాలన్న జ్ఞానం ఉండదు. నిశ్చలమైన మనస్సుతో పూజిస్తే శేషశయనుడు అందరిని అనుగ్రహిస్తాడు అనేందుకు ఉదాహరణ గుడాకేశుని కథ. మరోవైపు ఆరోగ్యపరంగా చూస్తే కూడా రాగిపాత్రల్లో జలం సేవించడం మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. రాగిపాత్రల్లోని తీర్థాన్ని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి, రక్తశుద్ధి ఉంటుందని భారతీయ సంప్రదాయ వైద్య శాస్త్రాలు పేర్కొంటున్నాయి. Facebook Share Twitter Share