ఎక్కువ ఆలయాలు కొండమీద ఎందుకు ఉంటాయి?

దేవుళ్లలో తేడా ఏమీ ఉండదు. ఎక్కడున్నా దేవుడు దేవుడే! నేలమీద ఉన్నా కొండపైన ఉన్నా భగవంతుడు అందరినీ సమదృష్టితో చూస్తాడు. కరుణా కటాక్షాలను అందిస్తాడు. అయితే మనం ఎంత కష్టానికి ఓర్చి దైవ దర్శనం చేసుకోగలం? మనకు తనపై ఎంత భక్తి విశ్వాసం ఉన్నదో తెలియజేసేందుకు దేవుళ్లు కొండలపై, గుట్టలపై నెలకొన్నట్టు పెద్దలు చెబుతారు. మనిషి, పశువు, రాయి, చెక్క అందరూ జీవులే! దేవుని విగ్రహం, కల్యాణమండపం రాయితోనే చెక్కుతారు. అదే రాయి వధ్యశిలగా, శ్మశానశిలగా ఉంటుంది. అదే పరమాత్ముని లీల అని చెప్పవచ్చు. కొండలను, కోనలను ఉద్ధరించాలని స్వామికి ప్రేమ. అందుకే వాటిపై నివాసముంటాడు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు. తన పాదస్పర్శతో, భక్తుల పాదస్పర్శతో కొండలు తరిస్తాయి. సెలయేళ్లతో, ఫలవృక్షాలతో భక్తులకు సేదతీరుస్తాయి. దీని కోసమే రుషులు కొండలుగా పుట్టాలని కోరుకుంటారు. భద్రగిరి, యాదగిరి, వేదగిరి వీరంతా రుషులే! తపస్సు చేసి తమపై కొలువుండాలని కోరుకొని మరీ స్వామిని పిలుచుకున్నారు. పరోపకార పరాయణులు ముగ్గురే పర్వతాలు, నదులు, వృక్షాలు అంటారు మహాకవి వాల్మీకి. ఈ ముగ్గురు ఉన్నంతవరకు రామాయణం భూమి మీద ఉంటుందని వాల్మీకికి బ్రహ్మ వరమిస్తాడు. అందుకే కొండలు, కోనలు భగవంతునికి ప్రీతిపాత్రమైనవి.