అమావాస్యకు పితృదేవతలకు శ్రాద్ధం పెట్టాలా?

మన శ్రేయస్సును కోరుకునేవారు పితృదేవతలు. సూర్యోదయ, సూర్యాస్తమయం పితృదేవతలకు వేరుగా వుంటాయి. కృష్ణపక్ష అష్టమి తిథి మధ్యలో వారికి సూర్యుడు ఉదయిస్తాడు. శుక్లపక్ష అష్టమి నాడు అస్తమిస్తాడు. దీన్ని బట్టి చూస్తే అమావాస్యకు సమయం వారికి మధ్యాహ్న సమయవుతుంది. పితృదేవతల గురించిన పూర్తి వివరాలను విష్ణుపురాణం ప్రధమఖండం వెల్లడిస్తోంది. ప్రతి అమావాస్యకు పితృదేవతలకు పిండాలు పెడితే వారు సంతోషిస్తారు. పిండాలు పెట్టలేని స్ధితిలో వున్నవారు కనీసం నీరు వదలాలి. అది కూడా చేయలేని పరిస్థితిలో గడపవైపు తిరిగి నమస్కరించాలి. పితృదేవతలు ఏడుగణాలుగా వుంటారు. మొదటి మూడు గణాల దేవతలు అమూర్తులుగా అంటే వారికి ఎలాంటి ఆకారాలు వుండవు. మిగిలిన నాలుగు గణాలైన వారికి మాత్రం ఆకారాలుంటాయి. పితృగణాలు దేవుళ్లతో కలిసి శ్రాద్ధాన్ని భుజిస్తాయి. భోజనంతో సంతృప్తి చెంది శ్రాద్ధ దాతకు సుఖ, సంతోషాలను ఇస్తుంటాయి. దీంతో పాటూ శ్రాద్ధ దాతకు సంబంధించిన తాత, ముత్తాత, తండ్రి ఏలోకంలో వున్నా పితృదేవతలు వారిని జాగ్రత్తగా చూసుకుంటారు. మనకు తెలిసి పితృదేవతలంటే తాత, తండ్రి అనుకుంటారు. అయితే దేవతాగణంలో ఏడు విభాగాలుగా వీరు వుంటారని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. పితృదేవతలు తృప్తిగా వున్నంత కాలం యావత్‌ విశ్వం సుభిక్షంగా వుంటుంది. అందుకనే విధిగా పితృదేవతలకు ఈ కార్యక్రమం చేయాలి.